Tuesday, September 4, 2018

ప్రభాస్ కోటిచ్చాడు..

కేరళ క‘న్నీటి’ వర్షంలో తడిసిముద్దైన సంగతి తెలిసిందే.. శతాబ్ధకాలంలోనే పెద్ద ఎత్తున ముంచెత్తిన వరదలతో వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. వందల సంఖ్యలో మరణించారు. కేరళను ఆదుకోవాలని అక్కడి సీఎం పిలుపునివ్వడంతో ఎంతో మంది ఎన్నో కోట్ల రూపాయలను పంపించారు. వివిధ దిగ్గజ సంస్థలు ఆదుకునేందుకు ముందుకు వచ్చాయి.
కేరళను ఆదుకోవడంలో సినీ ప్రముఖులు కూడా కీలక పాత్ర పోషించారు. తెలుగు - తమిళం - మలయాళ - హిందీ నటులు ఇతోధికంగా సాయం చేశారు. కానీ ఇతర సినీ స్టార్లతో పోలిస్తే మలయాళ సినీ పరిశ్రమకు చెందిన స్టార్స్ ఆర్థిక విరాళాలు తక్కువే అందించారనే విమర్శ ఉంది. అందరికంటే ముందు తమిళ స్టార్ హీరో బ్రదర్స్ సూర్య-కార్తి సోదరులు రూ.25 లక్షలు ప్రకటించారు. ఆ తర్వాత మిగతా హీరోలు కూడా భారీగానే విరాళాలందించారు.

తాజాగా మలయాళ సినీ స్టార్ల పిసినారితనంపై కేరళ టూరిజం శాఖ మంత్రి కడకంపల్లి సుందరేశన్ - నటి సుశీల సంచలన వ్యాఖ్యలు చేశారు. అవిప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మలయాళ నటులు విరాళాలు పెద్ద ఎత్తున ఇవ్వలేదని వారు మండిపడ్డారు. కోట్ల విలువ చేసే కార్లలో తిరిగే నటులున్న మలయాళ ఇండస్ట్రీలో సాయం చేయడానికి మాత్రం ముందుకు రాలేదని మండిపడ్డారు. 

కేరళ మంత్రి సుందరేశన్ మాట్లాడుతూ ‘మన రాష్ట్రంలో గొప్ప నటులున్నారు. ఒక్కో సినిమాకు 4 కోట్ల వరకూ సంపాదిస్తున్నారు. కానీ లక్షల్లోనే ఇచ్చారు. మలయాళంలో పెద్దగా మార్కెట్ లేని తెలుగు హీరో ప్రభాస్ రూ.కోటి విరాళం ఇచ్చారు. అతడిని చూసి నేర్చుకోండి’ అంటూ వ్యాఖ్యానించి సంచలనం రేపారు. 

అసలు అధికారికంగా ప్రభాస్ విరాళం ఇచ్చాడని తెలుసు కానీ ఎంతిచ్చాడనేది ఎవ్వరికీ తెలియదు.. ఆయన ఫ్యాన్స్ 25 లక్షలు ఇచ్చాడని అనుకున్నారు. ప్రభాస్ కూడా తాను విరాళమిచ్చిన విషయాన్ని బయటకు చెప్పలేదు. కానీ ఇప్పుడు కేరళ మంత్రి... ప్రభాస్ కోటి రూపాయలు ఇచ్చాడని అనడం.. ప్రభాస్ ది గొప్ప మనసు అని కీర్తించడం చూశాక ప్రభాస్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో మంచి చేసి కూడా ప్రచారం చేసుకోలేదంటూ కొనియాడుతున్నారు. ఇప్పుడీ వార్త వైరల్ గా మారింది. 

No comments:

Post a Comment