‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన దర్శక ధీరుడు రాజమౌళి, ఆ సినిమాకు కొనసాగింపైన ‘పార్ట్ 2’ను గత నెలలో సెట్స్‌పైకి తీసుకెళ్ళిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల పాటు హైద్రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ షెడ్యూల్ జరుపుకున్న ఈ సినిమా గతవారం రోజులుగా ఓ చిన్న షెడ్యూల్ కోసం కేరళ అడవులకు షిఫ్ట్ అయింది. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్, అనుష్క తదితరుల కాంబినేషన్‌లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించి నేటితో ఈ షెడ్యూల్‌ను పూర్తి చేసేశారు.
ఇక ఈ షెడ్యూల్ పూర్తవ్వడంతో కొన్ని రోజుల పాటు బ్రేక్ ఇచ్చి రాజమౌళి ఆ తర్వాత యూఎస్‌లో జరగబోయే భారీ షెడ్యూల్ కోసం సన్నాహాలు చేసుకోనున్నారు. బాహుబలి మొదటి భాగంలో ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’ అన్న సస్పెన్స్‌ను అలాగే దాచిపెట్టిన రాజమౌళి, ఆ సస్పెన్స్ కోసం బాహుబలికి రెండో భాగమైన ‘బాహుబలి ది కంక్లూజన్’ వచ్చే వరకూ ఎదురుచూడమని చెప్పారు. దీంతో బాహుబలి రిలీజ్ అయిన రోజునుంచే ‘బాహుబలి 2’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ, దానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ వస్తున్నారు. 2016 ఏడాది చివర్లో ‘బాహుబలి 2’ను విడుదల చేసేలా టీమ్ ప్రొడక్షన్ పనులు నిర్వహిస్తోంది.