rajini
భారత ప్రభుత్వం ప్రకటించే అత్యుత్తమ అవార్డుల్లో ‘భారత రత్న’ తరువాతి స్థానమైన ‘పద్మవిభూషణ్’ అవార్డుకు స్టూడియో అధినేత, పాత్రికేయ ప్రముఖులు రామోజీ రావు మరియు సూపర్ స్టార్ రజనీ కాంత్‌లు ఎంపికయ్యారు. పాత్రికేయ రంగంలో విశేష సేవలు అందించినందుకు గానూ రామోజీకి భారత ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించగా, సినీ పరిశ్రమకు నటుడిగా సేవలందించినందుకు గానూ రజనీ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఢిల్లీలో కొద్దిసేపటి క్రితం జరిగిన మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటించింది.
ఇక ఇదిలా ఉంటే పద్మ అవార్డుల్లో భాగంగా ప్రకటించే ‘పద్మశ్రీ’ అవార్డుకు దర్శక ధీరుడు రాజమౌళి ఎంపికయ్యారు. ‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన రాజమౌళి, సినీ పరిశ్రమకు అందించిన సేవలకు గానూ ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఇక ఇదే సమావేశంలో క్రీడా, వాణిజ్యం తదితర, వైద్యం తదితర రంగాల్లో సేవలందించిన పలువురికి పద్మ అవార్డులను ప్రకటించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డుల ప్రదానం జరగనుంది. పద్మ అవార్డులకు ఎంపికైన రజనీ కాంత్, రామోజీ రావు, రాజమౌళిలకు ఈ సందర్భంగా 123తెలుగు తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.